Articles by "హిందూ స్టోరీస్"
Showing posts with label హిందూ స్టోరీస్. Show all posts




 

*వైశాఖమాస ప్రారంభం* :

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు.

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ.

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.

                    


 
 
*శ్రీవారు మూడునామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి.............!!*

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి...

ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరచారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది..

శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం ?
మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?
మూడునామాల వాడిగా ప్రసిద్ధ చెందడానికి కారణమేంటి ?
సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.

అలా....

శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు...

ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు...

శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై అనే వాళ్లు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ప ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైయ్యాయి.

 

తోళప్పాచార్యుల కైంకర్యం 

 తిరుమలనంబి వంశీయుల భక్తి, సేవాభావం నేటికీ తిరుమలలో జీవంగా కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం తెల్లవారుజామున—సుమారు ఒక గంట సమయంలో—రక్షక సిబ్బంది వెంట, దివిటీల వెలుగులో, వారు కాలినడకన అరణ్య మార్గంలో సుమారు మూడు మైళ్ళు ప్రయాణిస్తారు.

 వారు మూడు బిందెలతో పవిత్రమైన ఆకాశగంగ తీర్థం నుండి జలాన్ని తెచ్చి, మేళతాళాలతో శ్రీవారి ఆలయంలోకి ఘనంగా ప్రవేశిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక అపూర్వమైన కైంకర్యంగా నిలిచింది.

ఈ ప్రయాణంలో మధ్యలో ఉన్న “బాట గంగమ్మ” ఆలయానికి చేరుకొని, ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకోవడం కూడా సంప్రదాయం. ఈనాటికీ ఆ అరణ్యమార్గంలో ఉన్న బాట గంగమ్మ ఆలయం, అలాగే ఆకాశగంగ తీర్థం భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నాయి




 

*ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా*?

*ధ్వజస్థంభం... ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది.*

*భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలుపెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెబుతాడు.*

*ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు.
*తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూర ధ్వజుడ్ని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలపరాక్రమవంతులైన భీమార్జునేలే ఓడిపోయారని అతడ్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు.
*శ్రీక్రిష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూర ధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు.
*వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూర ధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు.
*మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజా నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మా.. నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి.. అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి... మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
*ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం, నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూసే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్థంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది.



 

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణం :*
*ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.*

*శ్రీరామక్షేత్రాలు అన్నింటా సీతారామ కల్యాణం మిట్టమధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్ల పక్ష చతుర్దశినాటి రాత్రి పండువెన్నెల్లో రామకల్యాణం నిర్వహిస్తారు. అలా రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం. చందమామ అచ్చంగా కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన* *గాథ అందరికీ తెలిసినదే. అటువంటి శ్రీరాముడి కల్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కల్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి, బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుడిని ఓదార్చి మూడువరాలు ప్రసాదించాడు. ఆ వరాలేమిటంటే, రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం. తరువాతి జన్మలో శ్రీకృష్ణునిగా రాత్రిపూట జన్మించడం. కలియుగంలో రాత్రిపూట కల్యాణం చేసుకోవడం. అలా చంద్రుడికిచ్చిన మూడోవరంలో భాగంగా రాత్రి ఆ సమయంలో చైత్ర పౌర్ణమికి ముందురోజు చంద్రుడు ఆకాశం నుంచి చూస్తూ పండువెన్నెల కురిపిస్తూ ఉండగా ఒంటిమిట్టలో రామయ్య కల్యాణం జరుగుతుంది.*



స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం


తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.


పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు !
హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్తసులభుడు, హనుమంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేదపండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు.ఆంజనేయస్వామి నవావతరాలు ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి.ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు. పంచముఖాలు ఐదు దిక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి.

తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు

దక్షిణముఖంగా
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.

పడమర ముఖంగా
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు

ఉత్తరముఖముగా
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు

ఊర్ధ్వంగా
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

"శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు
అలాగే ఆంజనేయ స్వామికి 'శ్రీరామజయం' అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.




ఈ చిత్రం 2026లో శ్రీరామ నవమి పండుగను జరుపుకునే తేదీ గురించి వివరిస్తుంది.

శ్రీరామ నవమిని సాధారణంగా చైత్ర మాసం శుక్లపక్ష నవమి నాడు జరుపుకుంటారు.

2026లో నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం 2:18 గంటలకు ప్రారంభమై, మార్చి 27 మధ్యాహ్నం 12:36 గంటల వరకు ఉంటుంది.

సూర్యోదయ సమయంలో నవమి తిథి ఉన్నందున, పండితుల అభిప్రాయం ప్రకారం మార్చి 27 (శుక్రవారం) నాడు పండుగ జరుపుకోవాలి.

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మార్చి 27న జరగనుంది••


అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ


_Garikapati Narasimharao: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు స్పష్టతనిచ్చారు. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో విక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది._


_రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లు వస్తున్న వీడియో వక్రీకరించినదని ఆయన టీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సభలలో గరికపాటి నరసింహరావు అలా మాట్లాడలేదని వెల్లడించింది. ‘వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే. వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాలలో, పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.’ అని గరికపాటి టీం ఆ ప్రకటనలో వెల్లడించింది._


_అంతేగాక, ‘శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళితవాడలలో ఉన్న స్త్రీలకు పంచి పెట్టాలని ఎన్నోసార్లు వారు(గరికపాటి) పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ల పార్టీనే అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంత మంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున, ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా, సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువుగారి ఆకాంక్ష’ అని గరికపాటి నరసింహారావు బృందం వారి ప్రకటనలో స్పష్టం చేసింది._




మేల్కో హిందువా! ఇదేనా సమానత్వం?

ప్రభుత్వాల మతపరమైన పక్షపాతంపై నిలదీద్దాం! ఒకవైపు హిందూ ఆలయాల నిధులు ప్రభుత్వ పరమవుతుంటే, మరోవైపు భారీగా నిధుల మళ్లింపు జరుగుతోంది.

*వాస్తవాలు ఇవే:*

₹6,090 కోట్లు: ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు.

₹45 కోట్లు: ఇమామ్‌లు, మౌజామ్‌ల పెండింగ్ జీతాల విడుదల.

హజ్ యాత్ర: యాత్రికులకు భారీగా ఆర్థిక సాయం.

ఉర్దూ ఘర్‌లు & షాదీ ఖానాలు: కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు.

*మన ప్రశ్నలు:*

ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వేల ఆలయాల సంగతేంటి?

మన అర్చకుల దీన స్థితికి బాధ్యులెవరు?

హిందూ భక్తుల కానుకలను హిందూ ధర్మ ప్రచారానికే ఎందుకు వాడకూడదు?

ఇది ప్రజాస్వామ్యమా లేక మతపరమైన తుష్టీకరణా?

లౌకికవాదం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నిద్దాం!


చల్లని జీవితం కోసం గురుమంత్రాలు

*ముందుమాట:* 
 
*మన జీవితంలో సరదాగా చెప్పుకునే చిన్న చిన్న మాటలు కూడా మనలో పెద్ద మార్పులు తీసుకురాగలవు, ఇవి నవ్వు తెప్పించడమే కాకుండా జీవితం గురించి లోతుగా ఆలోచించేటట్లు చేస్తాయి, అందుకే ఈ గురుమంత్రాలను హాస్యంగా తీసుకుంటూ వాటి వెనుక ఉన్న అర్థాన్ని కూడా గ్రహించడం మంచిది.*

*1. డబ్బు అంతా కాదు (Money is not everything)* 
*డబ్బు జీవితంలో చాలా ముఖ్యమైనదే అయినా అది ఒక్కటే అన్నీ కాదు, మనుషుల ప్రేమ, ఆరోగ్యం, ఆనందం కూడా అంతే అవసరం అని గుర్తుంచుకుంటే జీవితం సమతుల్యంగా ఉంటుంది.*

*2. జంతువులను ప్రేమించండి (Love Animals)* 
*జంతువులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడం లాంటిదే, వాటిని గౌరవించడం ద్వారా మనలో దయ, కరుణ వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి.*

*3. నీటిని సేవ్ చేయండి (Save Water)* 
*నీరు లేకుండా జీవితం అసంభవం కాబట్టి ప్రతి చుక్కను ఆదా చేయడం మన బాధ్యత, వృథా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది.*

*4. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Food)* 
*పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఉండి రోగాలకు దూరంగా ఉండగలుగుతుంది.*

*5. పుస్తకాల విలువ (Value of Books)* 
*పుస్తకాలు మనకు జ్ఞానాన్ని అందించే గొప్ప మిత్రులు కాబట్టి వాటిని చదవడం ద్వారా మన ఆలోచనా విధానం మెరుగుపడుతుంది.*

*6. కార్యాలయంలో ప్రవర్తన (Office Behavior)* 
*ఆఫీసులో శాంతంగా, క్రమశిక్షణతో పని చేయడం వల్ల మనకు మంచి పేరు వస్తుంది మరియు సహచరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.*

*7. పొరుగువారితో సంబంధం (Neighbors)* 
*పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల అవసరమైనప్పుడు సహాయం పొందగలుగుతాము, కానీ వ్యక్తిగత పరిమితులను కూడా గౌరవించడం అవసరం.*

*8. కష్టపడి పని (Hard Work)* 
*కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది కానీ తెలివిగా పనిచేస్తే మరింత త్వరగా ఫలితాలు పొందవచ్చు అని గుర్తుంచుకోవాలి.*

*9. ఆలస్యం అలవాటు (Procrastination)* 
*పనులను వాయిదా వేయడం అలవాటు అయితే అది మన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది కాబట్టి సమయానికి పూర్తి చేయడం చాలా ముఖ్యం.*

*10. వివాహం గురించి (Marriage Life)* 
*వివాహం అనేది ఆనందం, బాధ్యత, సహనం, అర్థం చేసుకోవడం అన్నింటి మేళవింపు కాబట్టి దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.*

*11. నవ్వు శక్తి (Power of Smile)* 
*నవ్వు మనసుకు ఓ ఔషధం లాంటిది, అది మన ఒత్తిడిని తగ్గించి మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచుతుంది.*

*12. స్నేహితుల విలువ (Friends Value)* 
*మంచి స్నేహితులు జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తారు మరియు కష్టకాలంలో మనకు బలంగా నిలుస్తారు.*

*13. ఆరోగ్య జాగ్రత్తలు (Health Care)* 
*ఆరోగ్యం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం.*

*14. సమయం విలువ (Value of Time)* 
*సమయం ఒకసారి పోయిన తర్వాత తిరిగి రాదు కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం మన విజయానికి కీలకం.*

*15. జీవితం ఆనందంగా (Happy Life)* 
*జీవితం చిన్నదే కాబట్టి ప్రతి రోజును ఆనందంగా గడపడం, చిన్న విషయాల్లో సంతోషం కనుగొనడం నిజమైన సంతోషానికి దారి తీస్తుంది.*

*ముగింపు:* 
*ఈ గురుమంత్రాలు సరదాగా కనిపించినా అవి మనకు జీవితం గురించి విలువైన పాఠాలు నేర్పుతాయి, నవ్వుతూ జీవించడం నేర్చుకుంటే మన జీవితం నిజంగా చల్లగా, సంతోషంగా మారుతుంది.*






జనావాసాలు కాంక్రీటు అడవులుగా మారి కర్బన ఉద్గారాలను పెంచుతున్న ఈ రోజుల్లో..

బీహార్లోని గయాకు చెందిన బ్రజేంద్రకుమార్ చౌబే అనే గ్రామీణుడు ఆధునిక శైలికి విరుద్ధంగా, పర్యావరణహితంగా ఇంటిని నిర్మించారు. సిమెంటు, నీరు ఎక్కడా వాడకుండా.. ఇటుకల మధ్య ఆవుమూత్రం, పేడతోపాటు ప్రాచీన భారత సంప్రదాయాల్లో పేర్కొన్న ఔషధ మూలికలతో మేళవించిన మిశ్రమం ఉపయోగించి గృహనిర్మాణం పూర్తి చేశారు. దాదాపు 2 వేల చదరపు అడుగుల జాగాలో కట్టిన ఈ ఇంటికి నీటికి బదులుగా ఆవుమూత్రం.. సిమెంటుకు ప్రత్యామ్నాయంగా వేప, నిమ్మ, పసుపు, ఆమ్లా, నల్లతుమ్మ బంక తదితర సహజ పదార్థాలతో తయారుచేసిన జిగురును వాడారు. ఇదే జిగురుతో గోడలకు పూత పని కూడా చేశారు. రూ.5

లక్షల ఖర్చుతో నెలన్నర రోజుల్లో ఈ నిర్మాణం పూర్తయింది.

250 గిర్ జాతి ఆవులను పెంచుతున్న చౌబే తన గురువుతోపాటు పంచగవ్యాల (ఆవు నుంచి వచ్చే 5 రకాల ఉత్పత్తులు) స్ఫూర్తితో నిర్మించిన ఈ ఇల్లు ఆవును ‘నడిచే వైద్యాలయం'గా భావించిన మన మూలాల్లోకి వెళ్లే ఓ ప్రయత్నంగా పేర్కొన్నారు. దీన్ని పంచగవ్య ఆధారిత వైద్యకేంద్రంగా మార్చే యోచన ఉందన్నారు. సహజ ఉత్పత్తులతో కట్టిన ఈ విధమైన ఇళ్లు చల్లగా.. చెదలు పట్టకుండా ఉంటాయని గయా మున్సిపల్ కార్పొరేషను ఇంజినీరు సుభోద్కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు.


అమలాపురం వెంకన్న సాక్షిగా.. ప్రసాదానికి 'గ్యాస్' సెగ...

​ప్రతి ఏటా ఉగాది పర్వదినాన నోరూరించే తీపి ప్రసాదంతో భక్తులను ముంచెత్తే అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈసారి ఒక 'వింత' జరిగింది. వస్తువులన్నీ ఉన్నాయి.. దాతలు సిద్ధంగా ఉన్నారు.. కానీ ప్రసాదం మాత్రం పక్కన పెట్టేశారు.

​ఎందుకంటే..

"గ్యాస్ సిలిండర్ దొరకలేదు" అని దేవస్థానం వర్గాలు సింపుల్‌గా కారణం చెప్పేశాయి..

​ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కోనసీమలోని మిగతా ప్రధాన ఆలయాలన్నింటిలోనూ ప్రసాదాల వితరణ బ్రహ్మాండంగా జరుగుతోంది.. అక్కడ లేని 'గ్యాస్ కొరత' ఒక్క అమలాపురం వెంకన్న వంటగదిలోనే ఎందుకు వచ్చింది?

​రాష్ట్రంలో సరఫరా అద్భుతంగా ఉందని అధికారులు చెపుతుంటే, దేవుడి దగ్గరే సిలిండర్ మాయమవ్వడం విశేషం.

ఇది నిజంగానే ‘గ్యాస్ కొరతా’ లేక బాధ్యతను గాలికొదిలేసిన ‘నిర్వహణ కొరతా’?



 

సనాతన ధర్మం కథలు..కర్మ సిద్ధాంతం


తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అది మనల్ని శిక్షకు గురిచేస్తుంది. ఎవరు చేసే పాపపుణ్యాల ఫలితం వారే అనుభవించక తప్పదు. పాపం లేదు, పుణ్యం లేదు, మనం బతకడం ముఖ్యం, అందుకు ఏమైనా చేస్తాం... అనే వారివల్ల సమాజానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. పాపభీతి, పుణ్యకార్యాల స్పృహ లేని సమాజం చాలా వేగంగా పతనం వైపు పయనిస్తుంది.

కొంతమంది నగలు దొంగిలించి పారిపోతూ మాండవ్య ముని తపస్సు చేస్తున్న చోట దాక్కున్నారు. రాజభటులు దొంగలను వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చి వారిని పట్టుకున్నారు. మాండవ్య మునిని కూడా బంధించి రాజసభలో ప్రవేశపెట్టారు. రాజు వారికి శూలదండన విధించాడు. గుచ్చిన శూలం పైన ఉండి కూడా మాండవ్యుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ‘ఏం తప్పు చేశావు, ఈ శిక్ష అనుభవిస్తున్నావు?’ అని కొందరు తాపసులు అడగగా ఇందులో ఎవరి దోషం లేదని ‘దోషతః కం గమిష్యామి న హి మే అన్యో అపరాధ్యతి’ అని చెప్పాడు. రాజు ఆయన ధర్మదీక్షను గుర్తించి క్షమాపణ కోరాడు.           మాండవ్యుడు ధర్మదేవుడి దగ్గరికి వెళ్లి ‘నేను ఏం తప్పు చేశానని నాకీ శిక్ష వేశావు’ అని అడిగాడు. ‘నువ్వు చిన్నప్పుడు మిడతలు పట్టుకుని వాటి తోకల వెనక ఇషీక అనే వాడియైన గడ్డిని దూర్చి బాధ పెట్టావు. అందుకే నీకీ శిక్ష. చిన్న దానం చేసినా వందరెట్లు ఫలితం వస్తుంది. అలాగే చిన్న దోషం చేసినా వందరెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది’ అని ధర్మదేవుడు చెప్పాడు. ‘పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు ఏ తప్పు చేసినా అది తెలియక చేసిన దోషమే అవుతుంది. ఈ ధర్మసూక్ష్మం తెలుసుకోకుండా నన్ను శిక్షించావు కాబట్టి నువ్వు మానవలోకంలో జన్మించు’ అని మాండవ్యుడు ధర్మదేవుణ్ని శపించాడు. దాని ఫలితమే ఆయన విదురుడిగా జన్మించాల్సి వచ్చింది. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మల దోషాల ఫలితం అనుభవించక తప్పదని భారతంలోని ఈ కథ చాటి చెబుతుంది.

పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు మన నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఏవి మంచి పనులు, ఏవి చెడ్డ పనులు అన్నది మన అంతరాత్మకు తెలుసు. మనం చేసే కర్మల ఫలితం ఈ లోకంలో మనం జీవించి ఉండగానే అనుభవించడం తథ్యమని తెలుసుకోవాలి. సమాజ హితం కోరే మంచి పనులు చేయాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక పరిణతి కూడా పెరగాలి. అరిషడ్వర్గాలపై నియంత్రణ సాధించాలి. దాన్ని ఎంత చిన్న వయసులో సాధిస్తే అంతగా మానసిక ప్రశాంతత, అంతరంగ నిర్మలత్వం అలవడతాయి. అవి చేకూరినప్పుడు కర్మ ఫలితాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తాం.


కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ

Kotappakonda Trikoteswara Swamy Temple దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు.
కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.
దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు.